నిమ్మగడ్డ రమేశ్ పై మరోసారి విమర్శలు గుప్పించిన సజ్జల

  • వారం రోజుల్లో పూర్తయ్యే ఎన్నికలకు వ్యాక్సిన్ సాకుగా చూపుతున్నారు
  • కరోనా విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాం
  • ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉంటాం
ఏపీలో పరిషత్ ఎన్నికలను నిర్వహిస్తే వారం రోజుల్లో పూర్తవుతాయని... అయితే, ఎన్నికలను నిర్వహించకుండా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కరోనా వ్యాక్సిన్ ను సాకుగా చూపుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

కరోనా వ్యాక్సిన్ కోసమని మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని ఆనాడు నిమ్మగడ్డను కోరామని... అయినా అప్పుడు ఆయన వినలేదని చెప్పారు. ఇప్పుడేమో ఆరు రోజుల్లో పూర్తయ్యే ఎన్నికలకు వ్యాక్సిన్ సాకు చూపుతున్నారని విమర్శించారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని చెప్పారు. రానున్న రోజుల్లో కోట్లాది మందికి వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు.

ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడే ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంతో కృషి చేసిందని సజ్జల చెప్పారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి, ప్యాకేజీకి ఒప్పుకున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు చేసిన ఆ పనికి ప్రత్యేక హోదా డిమాండ్ సగం చచ్చిపోయిందని అన్నారు. చంద్రబాబులా తాము దొంగాట ఆడబోమని.. హోదా కోసం పోరాడుతూనే ఉంటామని చెప్పారు.

Sajjala Ramakrishna Reddy
YSRCP
Nimmagadda Ramesh
Chandrababu
Telugudesam

More Telugu News